ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Saturday, January 29, 2011
సూరి హత్య కేసు: మీడియా ముందుకు నలుగురు నిందితులు
సూరి హత్య కేసు: మీడియా ముందుకు నలుగురు నిందితులు
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నలుగురు నిందితులను హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. భాను కిరణ్ గన్మన్ మన్మోహన్ సింగ్తో పాటు సుబ్బయ, ఆవుల వెంకటరమణ, బోయ వెంకట హరిబాబు అనే వ్యక్తులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. పరిస్థితిని బట్టి సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అని, అతను పరారీలో ఉన్నాడని ఖాన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సూరిని భానుయే కాల్చి చంపాడని ఆయన చెప్పారు. భాను కోసం మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుత స్థితిని బట్టి ఆర్థిక లావాదేవీలు, భూ దందాలు, స్పర్థలు సూరి హత్యకు కారణమని అర్థమవుతోందని, భాను దొరికితే మరేదైనా కోణం వెలుగు చూస్తుందేమో చెప్పలేమని ఆయన అన్నారు. నిందితుల నుంచి సిమ్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. హత్యకు ఎప్పుడు ప్రణాళిక రచించుకున్నాడో భాను దొరికితేనే తెలుస్తుందని ఆయన అన్నారు.
భాను కిరణ్ సూరిని హత్య చేసి పక్కనే నిలిపి ఉంచిన బైక్పై హరిబాబు, సుబ్బయ్యలతో కలిసి నగర శివారులోకి పారిపోయాడని, ఆ తర్వాత మన్మోహన్తో కలిసి షోలాపూర్ వైపు పారిపోయాడని ఆయన చెప్పారు. ఆ తర్వాత లోకనాథ్ అనే వ్యక్తితో కలిసి భాను పారిపోయాడని ఆయన చెప్పారు. షోలాపూర్, గుర్గావ్ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చారని ఆయన అన్నారు. సూరి హత్య కేసులో 30 మందిని విచారించామని, కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించామని ఆయన చెప్పారు. భాను, తదితరుల పేర్ల మీద 100కు పైగా ఆస్తులున్నాయని, భాను పేరు మీద 9 ఆస్తులున్నాయని ఆయన అన్నారు. వాటి నిగ్గు తేల్చడం తమ పని కాదని, వాటి నిగ్గు తేల్చడానికి సంబంధిత శాఖలకు, సంస్థలకు అప్పగించామని ఆయన చెప్పారు. సూరి హత్య కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. హత్య చేసి భాను వస్తున్నట్లు తనకు తెలియదని, బస్సు దొరకడం లేదని, అందువల్ల వారి కోరికతో కారులో షోలాపూర్ వరకు డ్రాప్ చేసి వచ్చానని లోకనాథ్ అనే వ్యక్తి తనంత తానుగా వచ్చి తమకు చెప్పాడని, అందువల్ల అతన్ని నిందితుడిగా చేర్చలేదని ఆయన అన్నారు.
భానుపై మూడు కేసులు నమోదయ్యాయని, అవి బెదిరింపులకు సంబంధించి కేసులేనని ఆయన అన్నారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే సాక్ష్యాధారాలు చూసి చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. సూరి హత్య కేసులో రాజకీయ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నానని, తనకు కేసు దర్యాప్తు ముఖ్యమని ఆయన అన్నారు. హత్యకు సహాయం కోసం పెట్టుకున్న వ్యక్తుల్లో ఆవుల వెంకటరమణ ఒక్కడని ఆయన చెప్పారు. సూరి డ్రైవర్ మధుమోహన్ రెడ్డి్ చెబుతున్న ప్రకారం అతనికి ప్రమేయం ఉన్నట్లు అనుకోవడం లేదని ఖాన్ చెప్పారు.
No comments:
Post a Comment