ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎవరి ఓట్లయినా అడుగుతామని కూడా ఆయన చెప్పారు. తాము పోటీ చేయని చోట్ల తమ ప్రజాప్రతినిధులు ఓటింగుకు దూరంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు గురువారం సాయంత్రం చెప్పారు. అయితే, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఓటింగుకు దూరంగా ఉండేలా లేరు. మిగతా చోట్ల కూడా బహుశా ఉండకపోవచ్చు. ఈ పరిణామాలను, ముఖ్యమంత్రి ప్రకటనను చూస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఒప్పందం కుదిరినట్లే కనిపిస్తోందని అంటున్నారు. ఆదిలోనే వైయస్ జగన్ను, అందులోనూ కడప జిల్లాలో దెబ్బ తీయడానికి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కటైనట్లు అనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడప జిల్లాలో వైయస్ జగన్ వర్గం నుంచి శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవరగుడి నారాయణ రెడ్డిని పోటీకి దించుతోంది.
దేవరగుడి నారాయణ రెడ్డిని ఓడించి ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవడానికి జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం జిల్లా నాయకులతో సమావేశాలు, విందులు జరుపుతూ తమ వైపు తిప్పుకుంటున్నారు. అంతేకాకుండా, కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికలు వస్తే సీమాంధ్రలో వైయస్ జగన్ వర్గం, తెలంగాణలో తెరాస గెలుస్తాయనే భయంతోనే వారిద్దరు ఒక్కటైనట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
No comments:
Post a Comment